పశ్చిమ బెంగాల్ లో పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. దీనితో ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మాల్దా, ముర్షీదాబాద్, హౌవ్డా, నార్త్ 24 పరగణా, సౌత్ 24 పరగణా జిల్లాల్లో ఈ సేవలను నిలిపివేసినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. సోషల్మీడియాలో తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు నిరోధానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిరసనలు హద్దులు మీరితే ఊరుకునేది లేదని మమతా స్పష్టం చేశారు.
ఎప్పటి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నదీ అధికారులు చెప్పలేదు. ముర్షీదాబాద్లో ఐదు ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పౌరసత్వ చట్టంపై ఆందోళనలు ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. అసోంలోని 10 జిల్లాల్లో సోమవారం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు చోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది.