ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముంబైకి ఐదు ట్రోఫీలు రోహిత్ అందించడంతో.. భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను రోహిత్కు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇద్దరు కెప్టెన్లు ఉంటే తప్పేంటని, విరాట్ కోహ్లీకి కూడా వర్క్ లోడ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇలా కెప్టెన్సీ విభజనతో సక్సెస్ని అందుకోవడాన్ని కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అయితే రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వకపోతే దేశానికే నష్టమనే వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బిన్నంగా స్పదించారు. భిన్న సారథ్యం భారత సంస్కృతికి నప్పదని కపిల్ దేవ్ అన్నారు. ఒక బహుళ జాతి కంపెనీకి ఇద్దరు సీఈఓలు ఉండరు అని ఉదహరించారు. ‘మన భారత క్రికెట్ సంస్కృతిలో కెప్టెన్సీ విభజన సాధ్యం కాదు. ఒక పెద్ద కంపెనీకి ఇద్దరు సీఈవోలు ఉండగలరా?.. ఓసారి ఆలోచించండి. విరాట్ కోహ్లీ టీ20ల్లో ఆడుతుంటే.. కెప్టెన్గానూ అతడినే కొనసాగించాలి. అతడు బాగానే ఆడుతున్నాడు. జట్టులో మరో కెప్టెన్ కూడా ఉండాలనే నిర్ణయాన్ని నేనూ స్వాగతిస్తా. కానీ అది చాలా కష్టం’ అని కపిల్ దేవ్ అన్నారు.
‘కెప్టెన్సీ విభజన చాలా కష్టం. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలో దాదాపుగా 70-80 శాతం ఒకటే జట్టు. భారత వన్డే, టీ20, టెస్టు జట్టులో ఆడుతుంటుంది. సారథులు విరుద్ధమైన పద్ధతులు అవలంభిస్తే.. వారికి నచ్చవు. ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరు సారథులు ఉంటే జట్టు వాతావరణం మారిపోతుంది. ఫలానా వ్యక్తి టెస్టుల్లో సారథి కాబట్టి అతడికి కోపం తెప్పించకూడదు అని ఆటగాళ్లు ఆలోచిస్తారు’ అని కపిల్ దేవ్ పేర్కొన్నారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా ఐదో టైటిల్ని అందించిన రోహిత్ శర్మకి టీ20ల్లోనూ కెప్టెన్గా మెరుగైన రికార్డ్ ఉంది. దాంతో టీ20ల్లో అయినా అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనేదిని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఓ పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇక ముంబై క్రికెటర్లు విరాట్ కోహ్లీపై సెటైర్లు వేస్తూ తమ కెప్టెన్కి మద్దతు తెలుపుతున్నారు. ఇదే తరహాలో టీమిండియాలోనూ ఆటగాళ్ల విభజన జరిగే అవకాశం ఉందని కపిల్ దేవ్ చెప్పకనే చెప్పారు.