ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలకు ముసా పేట మెట్రో స్టేషన్ కింద రోడ్డు కుంగింది. భారీగా వరద రావడంతో పాటు… పిల్లర్ల కోసం తీసిన గోయ్యు కారణంగా .. రోడ్డు కుంగిపోయింది. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారి కేడ్ ఏర్పాటు చేశారు. భారీ గుంత పడటంతో ప్రజలు భయపడుతున్నారు.
అయితే, మెట్రోకు ఇబ్బంది లేదని… గతంలో తవ్వి, రోడ్డు వేసిన చోట కుంగిపోయిందే తప్ప మెట్రోకు వచ్చిన ఇబ్బందేమీ లేదంటున్నారు అధికారులు. మెట్రో పై వస్తున్న వదంతులపై మెట్రో ఎండి ఎంవిఎస్ రెడ్డి స్పందించారు. మెట్రో పిల్లర్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో మెట్రో రైలు కు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. మెట్రోపై వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని, సృష్టించవద్దని విజ్ఞప్తి చేసారు. మెట్రో పిల్లర్లు పూర్తి భద్రంగా ఉన్నాయని ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు ఎండి ఎంవిఎస్ రెడ్డి.