దేశమంతా ఒకే రేషన్ కార్డు విధానం తెస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కొత్త కార్డులు జారీచేస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో కొత్త కార్డుల జారీ నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు కావాలంటే మరికొంత సమయం ఓపిక పట్టాల్సిందేనని నగర పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దరఖాస్తులు తీసుకున్నప్పటికీ కొద్ది రోజులుగా దరఖాస్తులు తీసుకోవడం లేదు.
అధికారికంగా ఆదేశాలు అందనప్పటికీ కమిషనర్ కార్యాలయం నుండి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు హైదరాబాద్ సీఆర్వో కార్యాలయంలోని ఓ కీలక అధికారి తెలిపారు. దరఖాస్తు చేసుకున్నవారిలో లబ్ధిదారులుగా చాలా మందిని గుర్తించారు. దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ మళ్లీ ఆదేశాలు రాగానే కొత్త కార్డులు జారీచేస్తామని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు తప్పక కార్డులు అందిస్తామని అన్నారు.