ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత, జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య పట్ల నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న కక్షతో ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిని దారుణంగా బలితీసున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు లోకేష్. “ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులై నీ మదాన్ని అణిచేస్తాం సీఎం జగన్. ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు. నీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చేనేతవర్గానికి చెందిన నాయకుడిని అత్యంత కిరాతకంగా హత్యచేసారు. మీ అవినీతిని ఎండగట్టినందుకు కక్షగట్టి టిడిపి జిల్లా అధికారప్రతినిధి నందం సుబ్బయ్యను ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారు.హత్య చేసిన ఎమ్మెల్యే,అతని బావమరిది బంగారురెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలి. వేటకొడవళ్లతో తండ్రిని నరికేయించావు.నువ్విచ్చే పరిహారంతో అనాథలైన ఆ పిల్లలకు తండ్రిని తేగలవా? జగన్రెడ్డీ!” అంటూ తీవ్ర స్థాయిలో లోకేష్ ధ్వజమెత్తారు.