ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిజానికి గతేడాది వేసవిలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవల మొదలైన ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సర్కారు వారి పాట టీం అమెరికా ట్రిప్ను క్యాన్సిల్ చేసుకుంది. కుదిరినంత వరకు చిత్రీకరణను ఇక్కడే ప్రత్యేక సెట్లో పూర్తి చేసుకుంది. ఇక అమెరికాలో చేయాల్సిన షూటింగ్ మిగలడంతో మళ్లీ ట్రిప్ గురించి చర్చలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా ఎద్దడి ఎక్కువగా ఉండటంతో వీరి ట్రిప్ను వేరే దేశాలవైపు మార్చనున్నారు. ఇందులో భాగంగా కరోనా కేసులు తక్కువ ఉన్న దుబాయ్కి వెళ్లాలని వీరు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సర్కారు వారిపాట టీం దుబాయ్కి వెళ్లేందుకు కావలసిన సన్నాహాలు మొదలుపెట్టారు. అక్కడ దాదాపు మూడు వారాల పాటు చిత్రీకరణ జరగనుంది. కీలక నటీనటుల మధ్య జరగనున్న సన్నివేశాలను అక్కడ చేయబోతున్నారు. ఆ తరువాత మిగిలిన వర్క్ని హైదరాబాద్లోనే పూర్తి చేయనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో లేదా ఆ తరువాత విడుదల చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ చేస్తున్న మొదటి చిత్రం ఇది. దీనికి పరశురామ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఇందులో మహానటి కీర్తి సురేష్ మహేష్ సరసన చేయనుంది. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కనుందట. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.