పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై విమర్శలు గుప్పించారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మరేమీ ఉండరాదన్నది వాళ్ల ఉద్దేశంలా కనిపిస్తోందని ఆమె అన్నారు. తాజాగా పీటీఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు. ఇండియాలో ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు.
కరోనా మహమ్మారితో దేశం యావత్తూ పోరాడుతున్న వేళ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అస్థిర పరచాలని వారు భావిస్తున్నారు. మధ్య ప్రదేశ్ తరువాత వారి కన్ను రాజస్థాన్ పై, పశ్చిమ బెంగాల్ పై పడిందని విమర్శించారు.పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఓ విఫలమైన పార్టీ అని, గుజరాత్ నుంచి వచ్చి తమను పాలించాలని భావించే వారిని ఇక్కడి ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మమతా బెనర్జీ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలను బీజేపీని ఎంతమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడివారిని నిత్యమూ బీజేపీ అవమానాలకు గురిచేస్తేందని మండిపడ్డారు.