రాష్ట్రంలో మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తడంతో అధికారులు లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించబోతున్నారు. శుక్రవారం నాడు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాస్ ఉన్నవారినే లోనికి అనుమతించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 34 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో జరిగే లక్కీ డ్రాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు దరఖాస్తుదారులు. మరోవైపు సమయం సమీపిస్తున్నకొద్దీ. తమకు మద్యం దుకాణం దక్కుతుందా? లేదా? అన్న ఉత్కంఠ వారిలో పెరిగిపోతోంది.
రాష్ట్రంలోని 2,216 షాపులకు గాను 48,401 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి 968కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రంగారెడ్డి డివిజన్లో అత్యధికంగా 422 షాపులకు గాను 8,892 దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా హైదరాబాద్లో 173 షాపులకు 1,499 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో వ్యాపారులు సిండికేట్కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో… ఐదు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపులకు డ్రా నిలిపివేయనున్నారు. మద్యం షాపు దక్కించుకున్నవారు ఎనిమిదో వంతు లైసెన్స్ ఫీజును చెల్లించాలి. రెండేళ్ల కాలపరిమితిలో మూడు నెలలకు ఒకసారి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది.