ఇండియా-పాక్ సరిహద్దుల నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా దళాలు అప్రమత్తమైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గురించి మీడియాకు వెల్లడించారు.
కశ్మీర్ లోయలోని 69 పోలీస్స్టేషన్ల పరిధిలో పగటి వేళ ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిపారు. అదేవిధంగా జమ్మూలోని 81 పోలీస్స్టేషన్ల పరిధిలో ఆంక్షలను ఎత్తివేసినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సరిహద్దు దేశమైన పాక్ భారత్పై తన అక్కసు వెల్లగక్కుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.