మీటూ ఉద్యమాన్ని ముందు మొదలు పెట్టింది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. 15 ఏళ్ల క్రితం నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అక్కడి నుంచి ఈ ఉద్యమం ఊపందుకుంది. మీటూ ఉద్యమం చిత్ర పరిశ్రమలో సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఎందరో నటీనటులు మీటూపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా పాకిస్థాన్కు చెందిన బాలీవుడ్ నటి మహీరా ఖాన్ మీటూపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మీటూను కొందరు మిస్యూస్ చేస్తున్నారని అన్నారు. “ఇటీవల నేను ఓ న్యూస్ చదివాను. ఓ స్టూడెంట్ ప్రొఫెసర్పై తప్పుడు ఆరోపణలు చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆ స్టూడెంట్ను రేప్ చేసిన వ్యక్తి మాత్రం విచ్చలవిడిగా బయట తిరుగుతున్నాడు. ఒకరు చేసిన తప్పుకు అనవసరం ఓ అమాయకుడు బలైపోయాడు. మీటూ మూవ్మెంట్ను మిస్యూస్ చేసినా, న్యాయం జరగడంలో ఆలస్యమైనా చివరకు మిగిలేది మరణమే” అని వెల్లడించారు.
మీటూపై నటి పూజా హెగ్దే కూడా మాట్లాడారు. ఆమె కథానాయికగా నటించిన ‘హౌస్ఫుల్ 4’ సినిమాకు సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ అతను ఇద్దరు నటీమణులను రేప్ చేశాడని ఆరోపణలు రావడంతో అతన్ని సినిమా నుంచి తప్పించారు. అతని స్థానంలో ఫర్హాద్ సంఝీని ఎంపిక చేసుకున్నారు. దీనిపై పూజ మాట్లాడుతూ… “హౌస్ఫుల్ 4 సినిమాకు కథ రాసింది ఫర్హాదే. సాజిద్పై తప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి అతని స్థానంలో ఫర్హాద్ని తీసుకోవడంలో తప్పు లేదు. మీటూకు నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను. తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా బయటపెట్టిన నటీమణులకు హ్యాట్సాఫ్ చెప్పాలి. వారు మున్ముందు మరింత ధైర్యంగా పోరాడాలని ఆశిస్తున్నాను. ఎవ్వరూ మీటూని చులకనగా భావించడకండి” అని తెలిపారు.