జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. కేంద్ర బలగాలను మోహరించారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో నేడు ఏదో జరగబోతోందన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
తమను అదుపులోకి తీసుకోవడంపై మాజీ సీఎంలు ట్వీట్ చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా పిలుపునివ్వగా, సోమవారం ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలని మెహబూబా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామిలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నప్పటికీ పోలీసులు ధ్రువీకరించలేదు.