శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఉద్ధవ్ థాకరే తానెప్పుడూ ముఖ్యమంత్రిని అవుతానని అనుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా సేవలందించేందుకు తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంయుక్త సమావేశంలో తనను సీఎం అభ్యర్థిగా, మహావికాస్ అఘాడీ నేతగా ఎన్నుకున్న అనంతరం ఉద్ధవ్థాకరే మాట్లాడుతూ..ఒకరిపై ఒకరికున్న నమ్మకం, విశ్వాసంతో తాము ఈ దేశానికి కొత్త మార్గనిర్దేశకత్వాన్ని చూపిస్తామని చెప్పారు. ప్రజలంతా తనకు అప్పజెప్పిన బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. నేను ఒంటరిని కాదు. మీరంతా నాతో ఉన్నారని ఉద్ధవ్ థాకరే అన్నారు.
నిజమైన ప్రజాస్వామ్యం గెలిచిన రోజుగా ఉద్దవ్ కోర్టు తీర్పును అభివర్ణించారు. తామంతా కలిసి రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు తుడుస్తామని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎవరికీ భయపడను. అబద్దాలు హిందుత్వలో భాగం కాదు. మీరు అవసరమైనపుడు మమ్మల్ని కలుపుకుంటారు. అవసరం లేనపుడు దూరం పెడతారని బీజేపీపై ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు.