రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అక్షర సత్యం. అలాగే కొన్ని సందర్భాల్లో నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్లు నేడు శత్రువులుగా మారిపోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ లో ప్రస్తుతం మిత్రులు ప్రత్యర్థులు గా మారిపోయారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్, వైఎస్సార్సీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీచేస్తుండగా, మూడో అభ్యర్థిగా జనసేన తరఫున బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగారు.
మొన్నటి వరకు బోనబోయినటీడీపీలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. రెండ్రోజల క్రితమే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గంలో గల్లా జయదేవ్ విజయం కోసం బోనబోయిన ఎంతో కృషి చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సీన్ మారింది, ఇప్పుడు గల్లా జయదేవ్ పై బోనబోయిన పోటీకి దిగడంతో ఇద్దరి మధ్య స్పర్ధ నెలకొంది. ఈ నేపథ్యంలో, గల్లా తనను డమ్మీ క్యాండిడేట్ అన్నారంటూ మండ్డిపడ్డారు. తనను డమ్మీ అన్న వాళ్ల తాటతీస్తానంటూ హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గల్లా, మోదుగుల ఓటమిపాలవడం ఖాయమని ఈ ఎన్నికల్లో తన విజయాన్ని ఎవరు ఆపలేరని బోనబోయిన ధీమా వ్యక్తం చేశారు.