ట్విట్టర్ లో ఫాలోవర్స్ను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు …భారత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి స్వేచ్చ లేకుండా చేయడంలో ట్విట్టర్ సహకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఈ మేరకు ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్కు లేఖ రాశారు. “ట్విట్టర్ తనకు తెలియకుండానే పరోక్షంగా భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని భావిస్తున్నాను. 2021 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సగటున 4 లక్షల మంది కొత్తగా ఫాలోవర్స్ తన ఖాతాను అనుసరించే వారని, గత సంవత్సరం ఆగస్టులో తన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత నుంచే ఫాలోవర్స్ తగ్గుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. అంతకుముందు నెలకు 2.3 లక్షల మంది కొత్త ఫాలోవర్లు వచ్చే వారని.. పలు సందర్భాల్లో ఈ సంఖ్య 6.5 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు.
ఆత్యాచార భాదితుల గురించి, రైతుల సంఘీభావంగా నిలబడితే తప్పా ? అని ప్రశ్నించారాయన. రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులపై ట్రాక్టర్ ఎలా ఎక్కించారో వాటి వీడియోలను తాను ట్విట్టర్ లో పోస్టు చేయడం జరిగిందన్నారు. దీనిని దేశ వ్యాప్తంగా అత్యధికంగా వీక్షించినట్లు.. తన గొంతుకను ప్రజలకు చేరకుండా అణిచివేసేందుకు ట్విట్టర్ పై ప్రభుత్వం వత్తిడి చేసిందని లేఖలో ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఆరోపణలపై ట్విట్టర్ ప్రతినిధి స్పందించారు. రాహుల్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య సరిగ్గానే ఉందని తెలిపారు. యూజర్లను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వంటి వాటిని ట్విట్టర్ సహించదు. నకిలీ ఖాతాలపై మాత్రం ట్విట్టర్ కఠిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. మా విధానాలను ఉల్లఘించినందుకు గాను ప్రతి వారం కొన్ని లక్షల అకౌంట్లను తొలగిస్తామని తెలిపారు.