మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “సైరా… నరసింహారెడ్డి” సినిమా సెట్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేటలోని చిరంజీవి సొంత ఫాం హౌజ్లో వేసిన ‘సైరా’ సెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సెట్ దాదాపుగా కాలిపోయింది. దీంతో సుమారు రూ. 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. షాక్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కొద్దిరోజులుగా ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ చిత్ర బృందం షూటింగ్ జరిపింది.
మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తుండగా.. అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతిబాబు, సుదీప్ సహా పలువురు ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సెట్తో పాటు ‘సైరా’కు సంబంధించిన సెట్ కూడా దగ్ధమైపోయింది. దీంతో షూటింగ్కు కొంత కాలం ఆటంకం ఎదురైంది. ఆ తర్వాత శేరిలింగంపల్లిలో వేసిన సెట్ను ప్రభుత్వ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో సెట్ వేశారనే కారణంతో ప్రభుత్వ అధికారులు సెట్ను తొలగించారు. ఈ కారణంగానూ ‘సైరా’ షూటింగ్ ఆగిపోయింది. దీని తర్వాత తన సొంత ఫాం హౌజ్కు షూటింగ్ మార్చుకున్నారు చిరు. ఇప్పుడేమో అక్కడ అగ్నిప్రమాదం జరిగింది.
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!