తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా… పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. ఈసారి పోటీ ప్రధానంగా ‘మన ప్యానెల్’, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ మధ్యే ఉంది. ‘మన ప్యానెల్ ’ నుంచి తుమ్మల ప్రసన్నకుమార్, వై.వి.ఎస్.చౌదరి, పల్లి కేశవరావు, నట్టి కుమార్, మోహన్ వడ్లపట్ల, ఎం. శివకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జె.పుల్లారావు, వి.సాగర్, డి.రమేశ్బాబు, సి.ఎన్.రావు తదితరులు పోటీ చేస్తున్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున దిల్ రాజు, డీవీవీ దానయ్య, కొర్రపాటి సాయి, వై. రవిశంకర్, శివలెంక కృష్ణ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, దామోదరప్రసాద్, ఆచంట గోపీనాథ్, సూర్యదేవర నాగవంశీ, బెక్కెం వేణుగోపాల్, కె.కె. రాధామోహన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇరు వర్గాలకూ ఈ ఎన్నికలు కీలకం కావడంతో శనివారం సాయంత్రం వెలువడే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 1438 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కొనసాగుతుండగా ఒకానొక దశలో నిర్మాతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రసన్నకుమార్, నట్టికుమార్ లాంటి వాళ్లు కలుగజేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.