లాక్ డౌన్ నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రచారమవుతున్న వార్త అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ ఇది ఓ ఫేక్ న్యూస్ అని పేర్కొంది. భారత స్టాంప్ చట్టంలో చేసిన మరికొన్ని సవరణలకు సంబంధించి 2020 మార్చి 30న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. “ఆర్థిక సంవత్సరం పొడగింపు లేదు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 నెలల పాటు కొనసాగుతుందని, పారిశ్రామిక, ఆర్థిక వర్గాలకు సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం వెల్లడించినట్టు పుకార్లు వ్యాపించాయి. 2020 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కాకుండా జూలై 1 నుంచి మొదలవుతుందని కూడా పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.