అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరింది. భారతదేశ 15 వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణం స్వీకారం చేశారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు .
ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు ద్రౌపది ముర్ము రాజ్ ఘాట్ వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.
రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు.
అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు.