ఏపీ లో ఇసుక కొరత పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇసుక కొరతతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నట్టు… ఇసుకకు కూడా ముహూర్తం పెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం ముహూర్తాలు లేవని ఎద్దేవా చేశారు.జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.
రానున్న నాలుగున్నరేళ్ల పాలనను తలచుకుంటేనే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కన్నా తప్పుబట్టారు. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తే… రాయలసీమలో ఇసుక కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. ఆత్మహత్యలకు పాల్పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని అడిగితే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.