కరోనా వైరస్ విషయంలో అటు చైనా, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. నిన్న అర్ధరాత్రి వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ చైనా, డబ్ల్యూహెచ్వో నిర్లక్ష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైరస్ విషయంలో కీలక అంశాలు దాచిపెట్టిందని ఆరోపిస్తూ చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపారు. అమెరికా చట్టాలను గౌరవించకుండా అమెరికా గడ్డపై ఉన్న చైనా కంపెనీలపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూహెచ్వోకు ఇప్పటి వరకు అందిస్తూ వచ్చిన నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.