వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నామని, కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు.
ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా సాగించారని దుయ్యబట్టారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు.
రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులతో పాటు అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారని అన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని చంద్రబాబు చెప్పారు.