కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఏపీ రాజధాని అమరావతి మహిళలు ఈ రోజు కలిశారు. అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన మహిళలు, రైతులు సికింద్రాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. రాజధానిపై నెలకొన్న పరిణామాలను కిషన్ రెడ్డికి వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడంతో కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధాని మార్పు జరగదని హామీ ఇచ్చారు. ఏపీ రాజధాని మార్పు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కుటుంబసభ్యులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.