తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్తో నివేదిక తెప్పించుకున్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని దుయ్యబట్టారు. గల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తానా అన్న చందంగా బీజేపీతో టీఆర్ఎస్ స్నేహం చేస్తోందని ఆరోపించారు. సెలవులు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న సీఎం కేసీఆర్ గురించి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నానన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు విభజించి.. పాలించే టీఆర్ఎస్ కుట్రలో చిక్కుకోకుండా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విఙ్ఞప్తి చేశారు.