హైదరాబాద్కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆపై అత్యంత కిరాతకంగా ఆమెను దహనం చేశారు. ఈ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ నలుగురు ప్రియాంకను రేప్ చేసి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. అత్యంత కిరాతకంగా ప్రియాంకను చంపిన దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరి తీయాలని కోరుతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు అంతా ప్రియాంక కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఢిల్లీ ‘నిర్భయ’ ఘటన తరవాత మళ్లీ ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనమైన ఘటన ఇదే. ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. “హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి కావచ్చు, తమిళనాడులో రోజా కావచ్చు లేదా రాంచీలో గ్యాంగ్ రేప్కు గురైన లా స్టూడెంట్ కావచ్చు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఒక సమాజాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. అత్యంత విషాదకరమైన ఘటన నిర్భయ కేసు జరిగి ఏడేళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ మన నైతిక వస్త్రం ముక్కలుగా చిరుగుతూనే ఉంది. చట్టాలను మరింత కఠినంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఆగాలి” అని అక్షయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Whether it is #PriyankaReddy in Hyderabad, #Roja in Tamil Nadu or the law student gangraped in Ranchi,we seem to be losing it as a society. It has been 7 yrs to the gut-wrenching #Nirbhaya case & our moral fabric continues to be in pieces.We need stricter laws.This needs to STOP!
— Akshay Kumar (@akshaykumar) 29 November 2019