విశాఖ జిల్లాలో ఓ బల్క్ డ్రగ్ కంపెనీ భూ దందాలకు పాల్పడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటైన ఆ కంపెనీ వెనుక ఉన్న పెద్దలు ఎవరని ఆయన ప్రశ్నించారు.
భూములిచ్చేది లేదని నాలుగు గ్రామాలంటున్నా ఎకరా 50 లక్షలు చేసే భూమిని 18 లక్షలకే అధికారులు ఎలా కేటాయిస్తారు? అని నిలదీశారు. ప్రజావసరాలకు ఉపయోగించే భూములను ఆక్రమించుకున్న సంస్థపై ఏం కేసులు పెట్టారో చెప్పండని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన (బల్క్ డ్రగ్ కంపెనీ) హెటెరో డ్రగ్స్ భూ దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందని సదరు పత్రికలో పేర్కొన్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటైన ఈ సంస్థ అనంతరం 400 ఎకరాలకు విస్తరించిందని అన్నారు. మరో అడుగు వేస్తూ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులను ఆక్రమించుకుందని ఆ వార్తా పత్రికలో ఉందన్నారు.