టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాడ కాసినో వ్యవహారంపై మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ రోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన బుద్ధా వెంకన్న గుడివాడ క్యాసినో వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యలో క్యాసినో నిర్వహించారని, అందులో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వాటా ఉందని , అందుకే కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
అదేవిధంగా చంద్రబాబు ఇంటిగేటు తాకితే కొడాలి నాని శవాన్ని ఇంటికి పంపిస్తామని ఘాటు వ్యాఖ్యలుచేశారు.
సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు సోమవారం సాయంత్రం బుద్ధా వెంకన్న ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయను ను స్టేషన్ ను రావాలని..స్టేట్ మెంట్ తీసుకొని పంపిస్తామని చెప్పారు. అయితే, టీడీపీ నేతలు అందుకు అంగీరించలేదుఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీస్ స్టేషన్ కు రావాలని ఎలా కోరుతారని బుద్దా వెంకన్న పోలీసులను ప్రశ్నించారు.
“నేను మాట్లాడిన మాటలు వాస్తవమే. డీజీపీ సవాంగ్.. సీఎం జగన్కు తొత్తుగా పనిచేస్తున్నారు. నా వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైతే కొడాలి నాని చేసినవి చట్టబద్ధమా?.. చంద్రబాబు నాయుడిపై కొడాలి నాని ఇంత కాలం పాటు తీవ్ర పదజాలం ఉపయోగించి విమర్శలు చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మరి కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
మరోవైపు బుద్దా వెంకన్నను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు బుద్ధా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బుద్దా వెంకన్నను తోటవల్లూరు పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై కూడా మండిపడ్డారు.