టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని కిష్కిందపాలెం, భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరులో ఈరోజు ఆయన పర్యటించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, కిష్కిందపాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇది ప్రభుత్వం సృష్టించిన విపత్తు అని, ఓ పద్ధతి ప్రకారం నీటిని దిగువకు వదిలితే సమస్యలు తలెత్తేవి కావని అన్నారు.యాభై వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని అన్నారు.
వరదలు సంభవించి వారం రోజులు దాటినా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులు నిలదొక్కుకునే వరకూ వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.