ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది రేపటితో(శుక్రవారం) ఓటు హక్కు నమోదుకు గడువు ముగుస్తుందని అన్నారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎన్నికల అనంతరం పరిశీలించి ఓటర్ల జాబితాలో చేరుస్తామని ఆయన వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబోమని స్పష్టంచేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుపైనే ఉందన్నారు. అనేక మాధ్యమాల ద్వారా ఓటరు నమోదు, తనిఖీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ స్థాయిలో ఓట్లు పెరిగేందుకు ప్రజలతో పాటు అన్ని వర్గాల కృషి ఉందన్నారు.
దరఖాస్తు చేసుకునేప్పుడు ఆన్లైన్లో సర్వర్ డౌన్ అయితే, ఆఫ్లైన్లో చేయవచ్చని తెలిపారు. ఓటర్ల నమోదులో ఏపీ వెనుకబడి ఉందన్న వాదనలు సరికాదని చెప్పారు. ఓటరు నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని చెప్పారు. 7.9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలో ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందని తమకు అంచనా ఉందన్నారు. జనవరి 11కు ముందు 20లక్షల కొత్త ఓట్లు జాబితాలో చేర్చామని తెలిపారు. ఈ నెల 25 తర్వాత మరో 20లక్షలకు పైగా ఓట్లు పెరిగే అవకాశముందన్నారు.
ఎన్నికల నిబంధనల అమలు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ద్వివేది తెలిపారు. 6600 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 61 అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు, 46 తాత్కాలిక చెక్ పోస్టులు, 18 మొబైల్ చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా ఉంచామన్నారు. సోషల్ మీడియా నిఘా కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
గత మూడు రోజుల్లో రూ.29.91 కోట్లు నగదు, 13.57 కిలోల బంగారం, 70 వాహనాలు, 190 జిలెటిన్ స్టిక్స్, 50 కిలోల అమ్మోనియం నైట్రేట్, 50 కిలోల బైండింగ్ వైర్, 125 కిలోల గంజాయి, 165 స్పోర్ట్స్ కిట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే ఎక్సైజ్ తనిఖీల్లో రూ.1.31 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
రాహుల్ హీరో..మోడీ జీరో: విజయశాంతి