telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కి తృటిలో త‌ప్పిన ప్రమాదం..

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ఘటనలో కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు చెందిన వైసీపీ నేత మురళీధర్‌రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమం ముగించుకుని స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకునే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

సజ్జల కాన్వాయ్ ప్రమాదానికి గురయిందని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

Related posts