ఎలాంటి ఈవీఎంలనైనా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ ఐటీ సలహదారు హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం ఎంపీ రామ్మోహన్ నాయుడితో కలిసి తాను ఎన్నికల సంఘం అధికారులను కలిసినట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం లోపాలపై కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించినట్టు చెప్పారు.ఓటు వేయగానే వీవీ ప్యాట్లో అభ్యర్ధి పేరు సింబల్ కన్పించాలి.. కానీ అది కన్పించడం లేదన్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఓటు వేసిన తర్వాత 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్ పేపర్ కన్పించి ఈవీఎంలో పడిపోవాలన్నారు. కానీ, మూడు సెకన్ల పాటు మాత్రమే కన్పిస్తోన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈవీఎంలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో తన మీద కేసు ఫైల్ చేసిన తర్వాత కూడ వీవీ ప్యాట్ విషయంలో ఎన్నోసార్లు ఈసీ పిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.