తెలంగాణ లో 10 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్లగొండలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు.
గత ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని మండిపడ్డారు. మంత్రి వర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించలేదని విమర్శించారు. జెడ్సీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని అన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన కళ్లు నెత్తికెక్కాయని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.