‘మహానటి’ చిత్రం ఫేమ్ కీర్తి సురేశ్, భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇదే సమయంలో ఆమె పలు ఇతర నటీనటులతో కలిసి మోదీని కలిసిన చిత్రాలు బయటకు వచ్చాయి. ఇక మోదీ స్వయంగా కీర్తి సురేశ్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకూ అధికారికంగా కీర్తి స్పందించకపోయినా, ఆమె తల్లి మేనక సురేశ్ మాత్రం స్పందించారు.
తన భర్త బీజేపీలోనే ఉన్నారని, కీర్తి సురేశ్ ప్రచారం చేసిన మాట వాస్తవమేగానీ, ఇప్పటివరకూ ఆ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత సురేశ్ గోపి, కవిత వంటి నటీనటులతో కలిసి తాము మోదీని కలిశామని, ఆ ఫోటోలనే చూపిస్తూ, తన కుమార్తె రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇప్పటికైతే తమకు రాజకీయాలపై ఆసక్తి లేదని మేనక సురేశ్ వ్యాఖ్యానించారు.