దక్షిణాఫ్రికా సిరీస్ లో తొలి వన్డే మ్యాచ్ లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఒక్క రన్ తేడాతో ఓటమి చవి చూసింది. 226 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు.. ఓపెనర్లు మినహా మిగతావారు విఫలం కావడంతో తక్కువ వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్కు చేయాల్సిన పరుగులు 9. కాగా 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక ఎండ్లో జులన్ గోస్వామి (12 బంతుల్లో 14 నాటౌట్) ఉండటంతో భారత్ విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. అయితే 50వ ఓవర్ వేసిన విండీస్ సీనియర్ స్పిన్నర్ అనీసా దెబ్బ కొట్టింది. తొలి బంతికే ఏక్తా బిష్త్ (0)ను అవుట్ చేసింది. తర్వాతి 4 బంతుల్లో జులన్ 7 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండగా పూనమ్ యాదవ్ డకౌట్ అయ్యింది. దాంతో తొలి వన్డేలో భారత్కు పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 224 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. 55 రన్స్ వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
ప్రియా పూనియా (107 బంతుల్లో 75.. 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, జెమీమా రోడ్రిగ్స్ (75 బంతుల్లో 41.. 6 ఫోర్లు, సిక్స్) రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (32 బంతుల్లో 20.. ఫోర్), హర్మన్ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 5) విఫలమయ్యారు. అనీసాకు 5 వికెట్లు దక్కాయి. అంతకుముందు వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (91 బంతుల్లో 94.. 8 ఫోర్లు, 2 సిక్సు) సెంచరీ అవకాశం కోల్పోగా, నటాషా మెక్లీన్ (82 బంతుల్లో 51.. 6 ఫోర్లు, సిక్స్), చెడీన్ నేషన్ (55 బంతుల్లో 43.. 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో ఈ మ్యాచ్ జరిగింది.