త్వరలో జరగబోయే దిల్లీ అసెంబ్లీకి ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 2015లో 70 సీట్లకు గానూ 67 స్థానాల్లో గెలుపొందామని, ఈ సారి ఆ సంఖ్య తగ్గకూడదన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఒక్క నెల మాత్రమే సమయం ఉంది. ఈ సారి మన లక్ష్యం చాలా పెద్దది. గత సారి 67 స్థానాల్లో గెలుపొందాం. ఈ సారి అంతకంటే ఎక్కువే రావాలి తప్ప తక్కువ రాకూడదని కేజ్రీవాల్ అని అనడంతో సభ్యులు ’70కి 70′ అంటూ నినాదాలు చేశారు.
అభివృద్ధి నినాదంతోనే ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించారు. హిందూ- ముస్లిం ఎజెండా ఇక్కడ పనిచేయదన్నారు. గత ఐదేళ్లలో ఏం చేశామో అదే చెప్పాలన్నారు. వచ్చే నెలలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ సారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోనుంది.