ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. వై.ఎస్.జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం రద్దు పద్దుల్లో ఘనత వహించిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులనే కాదని, చివరికి పేదలకు ఇచ్చే ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ రద్దుల పద్దును అమలు చేస్తూ తన తీరును చాటుకుంటోందని దుయ్యబట్టారు.
గజం వంద రూపాయలకే రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 74ను జగన్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ అర్బన్ పార్టీ ఉపాధ్యక్షుడు రమణారావు ఈరోజు విజయవాడలో ప్రారంభించిన రిలే దీక్షను ఉమ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లకు బ్యాంకు రుణాలు కూడా మంజూరైన తరుణంలో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడం దారుణమన్నారు.