యూపీలోని లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతులను జీపుతో తొక్కించి చంపిన కేసులో హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను లఖీంపూర్ ఖేరీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా ఆచూకీ లేకుండాపోయిన ఆశిష్ను పోలీసులు 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.
విచారణలో ఆశిష్ మిశ్రా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవాలని ప్రయత్నించారు. తమకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. దీంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ చెప్పారు.
లఖీంపూర్ ఖేరీ టికునియాలో రైతుల హత్య కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఆయనపై హత్య, నేరపూరిత హత్య, హత్యకు కుట్రతోపాటూ మరికొన్ని కఠిన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
కాగా.. అక్టోబర్ 3వ తేదీన ఉత్తర్ప్రదేశ్లోని లఖీంపూర్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఘటన తర్వాత ఆశిష్ మిశ్రా నేపాల్కు పారిపోయాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన శనివారం ఉదయం 10.40కి ఆశిష్ మిశ్రా లఖీంపూర్ ఖేరీ పోలీసుల ఎదుట విచారణకు హాజరపరిచారు.