పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను రద్దు చేసింది. గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను తొలగించామని తెలిపారు. గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేశారని తెలిపారు. అందుకే ఇప్పుడు ఆ మార్కులను రద్దు చేశామన్నారు.
బిట్ పేపర్ని కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేసామని పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తామన్నారు. 2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నామని వివరించారు. మార్కుల షీట్ని కూడా నాణ్యంగా తయారుచేస్తామని, పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.