telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉగాదినాడు ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌ :చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది పండుగ సంద‌ర్భంగా కీలక ప్రకటన చేశారు. ఏపీలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని అన్నారు. త్వరలోనే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించనున్నట్టుగా చెప్పారు.

అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు అంటే సాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోందన్నారు.

ఇక, ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు… వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామని.. ఒక్కో కుటుంబానికీ రూ.లక్ష రూపాయలు జనసేన ఆర్థిక సహాయం అందజేస్తుందని వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నామని ప్రకటించారు పవన్ కల్యాణ్..

ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందన్నారు.. మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుంది..

కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటం లేదు.. కనీసం అధికారులు కూడా పరామర్శించడం లేదని విచారం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.

Related posts