కరోనా కట్టడి కోసం కేంద్రం చేపడుతున్న చర్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ లో జనాభా సంఖ్యకు తగిన విధంగా కరోనా టెస్టులు నిర్వహించడంలేదని విమర్శలు చేశారు. కరోనా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడంలో జాప్యం చేశారన్నారు. ప్రస్తుతం టెస్టింగ్ కిట్లకు విపరీతమైన కొరత ఏర్పడిందని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలో సామూహిక నిర్ధారణ పరీక్షలు కీలకమని భావిస్తున్న తరుణంలో మనం ఎక్కడున్నామో ఓసారి పరిశీలించుకోవాలని కేంద్రానికి హితవు పలికారు. సగటున 10 లక్షల మందికి నిర్వహిస్తున్న టెస్టుల సంఖ్య 149 మాత్రమేనని, ఈ విషయంలో మనం లావోస్ (157), నైజర్ (182), హోండురాస్ (162) దేశాల సరసన చేరామని రాహుల్ దుయ్యబట్టారు.