telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మందుబాబులకు గుడ్ న్యూస్ ..ధరలు తగ్గించిన ఏపీ

మందుబాబులకు శుభ వార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను మరోసారి ప్రభుత్వం సవరించింది. లాక్ డౌన్ లో పెంచిన మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. మద్యం ధరలు తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది అబ్కారీ శాఖ. దీంతో ఐఎంఎఫ్ఎల్ లిక్కరుతో పాటు, విదేశీ మద్యంలోని మద్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరలు కూడా తగ్గనున్నాయి. రూ. 50 నుంచి రూ. 1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మీడియం, ప్రీమియంలో 25 శాతం ధరలను తగ్గించింది. రేపట్నుంచే తగ్గించిన మద్యం ధరలు అమలు కానున్నాయి. బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. రూ. 200 రూపాయల్లోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేదని పేర్కొంది ప్రభుత్వం. రూ. 200 దాటిన క్వార్టర్ బాటిల్ ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్రాండ్లు, బాటిళ్ల పరిమాణాలను అనుసరించి 90 ఎంఎల్ కు రూ. 50 రూపాయల నుంచి లీటరు మద్యం ధర రూ. 1350 వరకూ తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎస్ఈబీ నివేదిక ఆధారంగా మద్యం ధరల తగ్గింపు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించిన ప్రభుత్వం…చీప్ లిక్కరుతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుండటంతో ఈ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది అబ్కారీ శాఖ. 2020 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 1211 కేసులు నమోదు అయినట్టు వెల్లడించిన ప్రభుత్వం..తెలంగాణా నుంచి 630, కర్ణాటక నుంచి 546, ఒడిశా నుంచి 24, తమిళనాడు నుంచి 11 కేసులు నమోదైనట్టు తెలిపింది. తెలంగాణా, కర్ణాటకల్లో మద్యం ఎమ్మార్పీ ధరలు ఏపీ కంటే రెండింతలు తక్కువ కావటంతోనే స్మగ్లింగ్ జరుగుతున్నట్టు నివేదిక ఇచ్చిన ఎస్ఈబీ…పొరుగు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఏపీ మండలాల్లో పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా నివేదిక ఇచ్చింది.

Related posts