ఈరోజు ఆర్టీసీ తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగోల్ లోని బండ్లగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బైఠాయించారు. బస్సులను అడ్డుకుని టైర్లకు మేకులు కొట్టిన కార్మికులు, తాత్కాలిక డ్రైవర్ ను చితకబాదారు. ఈ క్రమంలో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్ మండలం దాస్ నగర్ లోనూ ఉద్రిక్తత నెలకొంది. బస్సులపైకి ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వారు. ఆచన్ పల్లి, ముజారక్ నగర్ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. కరీంనగర్ లోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ బస్టాండ్ ఎదుట బస్సుపై సీపీఎం నేతలు కర్రలతో దాడి చేశారు. బస్సు టైర్లలో గాలి తీసే యత్నం చేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.