ఏపీ సీఎం జగన్ జగన్ రాజకీయ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం రూపొందించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పట్లోఅందరి ఆమోదంతోనే అసెంబ్లీలో ఈ చట్టాన్ని రూపొందించామని తెలిపారు.
జగన్ చేయాలనుకుంటున్న తప్పుడు పనులను ఆమోదింపజేసుకోవడానికి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులెవరికీ వెన్నెముక లేదని ఎద్దేవా చేశారు. రాజధానిని తరలించడం ఎవరి తరం కాదని అన్నారు. జగన్ చెప్పినట్టు విని, తప్పు చేసే అధికారులు రేపు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదనిహెచ్చరించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై ఆంక్షలు విధించడం దారుణమని అన్నారు.