భారతీయులంతటి అమాయకులను ప్రపంచంలో తానెక్కడా చూడలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. భారతీయులు ఏది చెప్పినా నమ్మేస్తారనీ, అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అని ఆయన చెప్పుకొచ్చారు.
నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం దేశం మొత్తం అమలైపోతోందంటే నిజమేనని సంబరపడిపోతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలో నా డ్రైవర్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేయమన్నాం. అక్కడి వైద్యులు అసలా పథకం గురించే మాకు తెలియదు అనడంతో కంగుతిన్నాం’ అంటూ చిదంబరం చెప్పుకొచ్చారు. ఎందుకూ కొరగాని పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.