ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. మూడు రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.
మూడు రాజధానుల అంశంపై ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఏపీ హైకోర్టులో ఇప్పటికే కేంద్రం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా మరో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులను అడ్డుకోగలిగే అధికారం కేంద్రానికి ఉందనేది పిటిషనర్ దోనె సాంబశివరావు అపోహ మాత్రమేనని తెలిపింది.
ఏపీ రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని మాత్రమే తాము చెప్పిమని వెల్లడించింది. అమరావతే ఏపీ రాజధాని అని కూడా తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ అంతిమ నిర్ణయమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వ తాజా అఫిడవిట్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్టయింది.