కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని కేంద్రానికి టీడీపీ పొలిట్బ్యూరో విజ్ఞప్తి చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. అనంతరం టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ముందు చూపును దేశమంతా అభినందించిందని చెప్పారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ. 50 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.