telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారు: చంద్రబాబు

chandrababu

ఏపీలో వైసీపీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు, పంటకు గిట్టుబాటు లేక బాధ పడుతున్న రైతులు… రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాధలే ఉన్నప్పుడు ఉత్సవాలు ఎందుకని ఎద్దేవా చేశారు. అవివేకమైన నిర్ణయాలతో ప్రజలను నట్టేట ముంచారని అన్నారు.

హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలు, మహిళలు, పేదలు, రైతులు, యువత అందరినీ రోడ్డెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యనిషేధం విధించడానికి 45 రోజుల లాక్ డౌన్ కాలం సరైనదని అన్నారు. కానీ, మద్యం షాపుల ముందు టీచర్లను కాపలాగా పెట్టి వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని అమ్మిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వైసీపీ అరాచకాలను మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts