అసెంబ్లీలో ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం ఉదయం టీడీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ ఫార్స్ టెండరింగ్ మారిందన్నారు. పోలవరంలో రూ.750 కోట్లు ఆదా చేశామని దొడ్డిదారిన మళ్లీ వ్యయం పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినవారి ఆర్థికమూలాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇది కొత్తతరహా దాడులని, చరిత్రలో ఎప్పుడూ జరగలేదని బాబు అన్నారు. అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం జగన్ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.