దివిస్ బాధితుల కన్నీళ్లు తుడవమంటే మంత్రి గౌతం రెడ్డి కథలు చెబుతున్నారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 75శాతం ఉద్యోగాలు గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ? రివర్స్ టెండరింగ్ తరహాలోనే దివిస్ పరిశ్రమపై నిర్ణయం తీసుకోవచ్చుగా అని నిలదీశారు. 36 మంది స్థానికులను విడుదల చేయమని మీరు చెబుతున్నారని…ఎవరూ మీ మాట పట్టించుకోవడం లేదన్నారు. దివిస్ లాబోరేటరీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే… పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడమని మంత్రి మేకపాటి అడుగుతున్నారంటే ఆయన విజ్ఞతపై సందేహాలు కలుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఆయన చెబుతున్న మాటలు సమస్యను ఏమార్చేదిగా బోడిగుండుకీ బొటన వేలుకీ ముడిపెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. దివిస్ లాబొరేటరీస్ కర్మాగారం కారణంగా అక్కడి 15 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు వినపడటం లేదా గౌతంరెడ్డి గారు? అని ప్రశ్నించారు. ఆ కర్మాగారానికి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఎంత వరకు సబబో మరోసారి ఆలోచించండని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు ఆపరా? ఆపలేరా? ఆయన ప్రారంభించిన అన్నిటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా అని నిలదీశారు. రాజధాని అమరావతిని ఆపారు…. పోలవరం ప్రాజెక్టును రివర్స్ లో తీసుకువెళ్తున్నారని చురకలు అంటించారు.