పర్యాటక ప్రాంతాలలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫైవ్ స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం, కల్చర్, శిల్పా రామంపై సమీక్ష నిర్వహించామని చెప్పారు. త్వరలో టూరిజం స్పాట్లలో హోటళ్లను రిపేర్ చేస్తామని పేర్కొన్నారు. ప్రముఖుల జయంతి, వర్థంతి లను 50 మందితో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తామని అన్నారు.
విశాఖ రాంకీ ప్రమాదంపై మంత్రి స్పందిస్తూ సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం అన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ప్రమాదానికి గురయ్యాక ఎంత నష్ట పరిహారాన్ని ఇచ్చినా లాభం లేదన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే పరిశ్రమలు నిర్వహించాలని మంత్రి సూచించారు.