దుబ్బాక ఉపఎన్నికల్లో రాజకీయం మరింత వేడెక్కింది. అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. అన్ని పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. నామినేషన్లు కూడా మొదలవడంతో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. పర్యటనలో హోరెత్తిస్తున్నారు. విమర్శలు…ప్రతి విమర్శలతో దుబ్బాక నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు.
అయితే..దుబ్బాక నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఇవాళ నామినేషన్ దాఖలు చేసారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా…17 న పరిశీలన, 19 వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నిక ఖరారైన విషయం తెలిసిందే.